అన్నమయ్య గాన సుధ, ఢిల్లీ
హస్తినలో అలరించిన అన్నమయ్య
అన్నమయ్య గాన సుధ, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో శ్రీమతి గరిమెళ్ళ కళ్యాణి గారు అన్నమయ్య కీర్తనల వేసవి శిక్షణా శిబిరం మే 16 నుండి జూన్ 13 , 2010 వరకు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీ శంకర అకాడెమీ ఆఫ్ సాంస్క్రిట్ కల్చర్ & క్లాసికల్ ఆర్ట్స్ ( శ్రీ దేవి కామాక్షి మందిరం) వారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించ బడ్డాయి. దాదాపు యాభై మంది శిష్యులు అన్ని వయసుల వారు, తెలుగేతరులు కూడా ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వరుని విశ్వరూప దర్శనమునకు అన్నమయ్య సంకీర్తనమే సాధనము. "ఒక్క సం కీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించగ “ అని కదా అన్నమయ్య భావన. అటువంటి పద కవితా పితామహుని సంకీర్తనలను అందరికి నేర్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శిబిరంలో అంతర్భాగంగా మే 9 న అన్నమయ్య కీర్తనలు పాడగలిగిన వారికి పోటీలు, మే 15 న అన్నమయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించ బడ్డాయి. శ్రీమతి గరిమెళ్ళ కళ్యాణి గారు వారి శిష్య బృందం అన్నమయ్య కీర్తనలు వీనుల విందుగా ఆలపించారు. పాటల పోటీలో పాల్గొన్నవారికి బహుమతులను శ్రీ తాళ్ళపాక అన్నమయ్య వంశజులలోని 12 వ తరంవారైన శ్రీ హరి నారాయణాచార్యులు తిరుపతినుండి పంపించారు. మే 23 వ తేదిన స్థానిక ఢిల్లీ తెలుగు సంఘం వారు ఆంధ్రప్రదేశ్ భవన్ లో నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీమతి కల్యాణి గారు తమ శిష్య బృందంతో కలసి సుమారు 15 అన్నమయ్య కీర్తనలను గానంచేసి శ్రోతలను ఆనంద సాగరంలో ఓలలాడించారు.
వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశ సభ జూన్ 13, 2010 న, మొదటినుండీ ఈ కార్యక్రమాలన్నింటికీ వేదికయైన శ్రీ దేవి కామాక్షి మందిర ప్రాంగణంలో జరిగింది. శిక్షణా శిబిరంలో నేర్చుకున్న కొన్ని కీర్తనలను శిష్యులు జంటలు జంటలుగా పాడి వినిపించారు. అనంతరం తమ గురువు శ్రీమతి గరిమెళ్ళ కళ్యాణి గారితో కలసి మరికొన్ని కీర్తనలను బృందగానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన శ్రీ ఎం. వి. రామారావు గారు అన్నమయ్య కీర్తనలను అందరకీ నేర్పి, ప్రచారం చేయాలనే తపన, దీక్షతో కూడిన శ్రీమతి కళ్యాణి గారి కృషిని ఎంతగానో ప్రశంశించారు.
సభకు విచ్చేసిన సంగీత ప్రియులందరూ ఢిల్లీలో మరెవ్వరు ఇంతవరకూ చేయని విధంగా మన తెలుగు వాగ్గేయకారుని కీర్తనలకు ప్రాచుర్యం కల్పిస్తున్న శ్రీమతి గరిమెళ్ళ కళ్యాణి మరియు వారి శిష్య బృందాన్ని ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమాల ప్రచారంలో ముఖ్యంగా సహకరించిన స్థానిక ఈనాడు, సాక్షి మరియు ది హిందూ పాత్రికేయులకు, నిర్వహణలో సహకరించిన మరెందరికో అన్నమయ్య గాన సుధ, తమ కృతజ్ఞతలను తెలియచేసింది. అనంతరం ప్రసాద వితరణతో వేసవి శిక్షణా శిబిర ముగింపు సమావేశం సుసంపన్నమయ్యింది.
******
No comments:
Post a Comment